Latest News:

దళిత జాతికే కళంకం సునీల్‌ కుమార్‌ పులివెందుల వేషాలు కుప్పంలో చెల్లవు అఫిడవిట్‌లో చెప్పినవన్నీ నిజాలే : వైఎస్‌ షర్మిల
Naralokesh padayatra,Yuvagalam
Naralokesh padayatra,Yuvagalam

చింతలపూడి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం యువనేత లోకేష్ కు అడుగడుగునా ఆత్మీయస్వాగతం

నేడు శ్రీరాంపురంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి

చింతలపూడి: యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 197వరోజు చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దుమ్మురేపింది. అభిమానుల షేక్ హ్యాండ్లతో ఎడమ భుజం తీవ్రంగా బాధిస్తున్నా పంటిబిగువన భరిస్తూ Nara Lokesh ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. చింతలపూడి ప్రజలు అడుగడుగునా యువనేతకు నీరాజనాలతో గ్రామాల్లోకి స్వాగతిస్తున్నారు. మార్గమధ్యలో ప్రజలు చెబుతున్న ప్రతిసమస్యను ఆలకిస్తూ నేనున్నానని భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగుతున్నారు. సుందరరావుపేట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం చింతలపూడిలో యువనేత పాదయాత్రకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోవడంతో భవనాలపై నిలబడి లోకేష్ కు అభివాదం తెలిపారు. వైసీపీపెంచిన పన్నులు, నిత్యవసర వస్తువుల ధరలతో బతుకుబండి లాగడం భారంగా మారిందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తంచేయగా, కరెంటు బిల్లును అడ్డగోలుగా పెంచేసి బిల్లు ఎక్కువచ్చిందన్న సాకుతో పెన్షన్లు తొలగిస్తున్నారని వృద్ధులు వాపోయారు. మరికొద్దిరోజుల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం ధరలను అదుపులోకి తెస్తుందని అభయమిస్తూ యువనేత ముందుకు సాగారు. సుందరరావుపేట, లింగపాలెం, వెలగపల్లి, ఫాతిమాపురం, చింతలపూడి మీదుగా తీగలవంచ విడిది కేంద్రం వరకు పాదయాత్ర సాగింది. 197వరోజు యువనేత లోకేష్ 22.7 కి..మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2646.7 కి.మీ.ల మేర పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నం పోలవరం నియోజకవర్గం శ్రీరాంపురంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

యువనేత లోకేష్ సెల్ఫీ చాలెంజ్

*చంద్రన్న సమర్థతకు సజీవ సాక్ష్యం…*

*చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం!*

ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా మెట్టప్రాంతంలో రైతులకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విస్తరణ పనులను శరవేగంతో పరుగులు తీయించారు దార్శనిక నేత చంద్రబాబునాయుడు. దీనిద్వారా రెండుజిల్లాల్లోని 33మండలాల్లో 4.80లక్షల ఎకరాలకు నీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.4909 కోట్ల అంచనాలతో పనులు చేపట్టి, అధికారం నుంచి వైదొలగేనాటికి రూ.2289 కోట్లు ఖర్చుచేశాం. ప్రాజెక్టు విస్తరణకు భూసేకరణ సమయంలో నిర్వాసిత రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రెచ్చగొట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు… ఉన్న ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక పాడుబెడుతున్నారు. విధ్వంసకుడు అరాచకానికి, చేతల మనిషి చంద్రన్న సమర్థతకు అద్దం పడుతోంది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.

పామాయిల్ రైతులకు ఉచితంగా మొక్కలు!

పామాయిల్ బోర్డు, ప్రత్యేక నిధి ఏర్పాటుకు కృషి

పామాయిల్ ఫ్యాక్టరీ, నర్సరీలను చర్యలు

ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్

చింతలపూడి: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామ్ ఆయిల్ మొక్కలు ఉచితంగా అందిస్తాం, మిషన్ మోడ్ లో పామ్ ఆయిల్ పంటను ప్రోత్సహిస్తాం, డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకురావడం కోసం కృషి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.  చింతలపూడిలో పామ్ ఆయిల్ రైతులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు.  పామ్ ఆయిల్ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. రైతులని ఆదుకోవడం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసుకునే అంశం పై కూడా చర్చించాం. కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టి రికవరీ రేటు పెంచేలా చర్యలు తీసుకుంటాం. పామ్ ఆయిల్ నర్సరీ ఏర్పాటు చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన పాలసీలను అధ్యయనం చేసి బోర్డు ఏర్పాటు చేస్తాం. పామ్ ఆయిల్ ని రాష్ట్రానికి పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్.  మెట్ట ప్రాంతం రైతుల అభివృద్ది కోసం ఆనాడే ఆలోచించి పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించింది ఎన్టీఆర్. పామ్ ఆయిల్ రైతులను ఆదుకున్నది, పామ్ ఆయిల్ రేట్లు పడిపోయినప్పుడు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది చంద్రబాబునాయుడు.

పామాయిల్ రైతులూ బాధితులే

దేశంలోనే ఎక్కువ పామ్ ఆయిల్ పండిస్తోంది ఆంధ్రప్రదేశ్. జగన్ పాలనలో పామ్ ఆయిల్ రైతులు బాధితులుగా మారారు. మొక్కలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు, పనిముట్లు దేనికి సబ్సిడీ రావడం లేదు. టిడిపి కేంద్రంతో సంప్రదింపులు చేసి పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకం 49 శాతం విధించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కేంద్రం దిగుమతి సుంకం ఎత్తేయడం తో పామ్ ఆయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదు. వైసిపి ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఎంపి లు పట్టించుకోవడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే  పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ని బలోపేతం చేస్తాం.

రికవరీ రేటు పెంపుదలకు కృషిచేస్తాం

పామ్ ఆయిల్ మొక్కలు ఉచితంగా అందించాలి అనే లక్ష్యంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కల రకాలు అభివృద్ది చేస్తాం. ఇతర దేశాల్లో పామ్ ఆయిల్ రికవరీ రేటు 22 శాతం ఉంటే ఇక్కడ కేవలం 15.5 శాతమే ఉంది . దీనిని పెంచడానికి టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న రేటు ఇప్పించి ఆదుకున్నారు. జగన్ ప్రభుత్వం కొత్త ఫ్యాక్టరీ పెడతాం అని మోసం చేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంతో చర్చించి డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకురావడం కోసం కృషి చేస్తుంది. కేంద్రంలో కూడా టిడిపి మద్దతు ఇచ్చే పార్టీ నే అధికారంలోకి వస్తుంది. 

పెట్టుబడులు తగ్గించేందుకు చర్యలు

పామ్ ఆయిల్ పెట్టుబడి తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ తో అనుసంధానం చేసి మొదటి మూడేళ్లు పెట్టుబడి తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. పామ్ ఆయిల్ దిగుమతి తగ్గిస్తే మన దేశానికి మేలు జరుగుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామ్ ఆయిల్ పంటను పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సబ్సిడీలు, రాయితీలు అందిస్తాం. కేంద్రం సబ్సిడీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటా ఇవ్వకపోవడం తో పామ్ ఆయిల్ రైతులకు సబ్సిడీలు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్, పరికరాలు, యంత్రాలు కూడా అందిస్తాం.

గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతుల పై కూడా కేసులు పెట్టాడు. రైతు కళ్లలో ఆనందమే టిడిపి లక్ష్యం. టిడిపి హయాంలో ఎప్పుడు గిట్టుబాటు ధర సమస్య వచ్చినా చంద్రబాబు ఉదారంగా ఆదుకొనే వారు. వైసీపీ పాలనలో అసలు వ్యవసాయ శాఖ ఉందా అనే అనుమానం వస్తుంది. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది. పామ్ ఆయిల్ పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత టిడిపి తీసుకుంటుంది.

పామాయిల్ రైతులు మాట్లాడుతూ…

పామ్ ఆయిల్ మొక్కల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో పామ్ ఆయిల్ నర్సరీ ఏర్పాటు చేయాలి. వైసీపీ ప్రభుత్వం కొత్త పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అని చెప్పి మోసం చేసింది. కొత్త ఫ్యాక్టరీ పెట్టి రికవరీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నాం. మొక్క, ఎరువులు, పురుగుల మందులు, లేబర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పాత మొక్కలు తీసి కొత్త మొక్కలు వేసుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించాలి. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మాకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు రావడం లేదు. టన్ను కి 13 వేలు రావడం కూడా కష్టం గా మారింది. కనీసం 18 వేలు వస్తే కానీ గిట్టుబాటు కాదు. టిడిపి హయాంలో మొక్క దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని సబ్సిడీలో అందించాం. బోర్డర్ లో ఉన్న పామ్ ఆయిల్ రైతులను వైసిపి నేతలు ఇబ్బంది పెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో టన్నుకి రూ.1600 ఎక్కువ ఉన్నా మేము అమ్ముకొనే అవకాశం లేకుండా చేశారు. ఆ సొమ్ము అంతా ఎమ్మెల్యే, ఎంపి తింటున్నారు.

లోకేష్ ను కలిసిన చింతలపూడి లిఫ్ట్ భూ నిర్వాసితులు

చింతలపూడి నియోజకవర్గం వెలగపల్లిలో ప్రగడవరానికి చెందిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మేం భూములు ఇచ్చాం. ఎకరానికి రూ.30లక్షలు ఇప్పిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటం చేయించారు. రూ.30లక్షలు ఇప్పించే అంశంపై పాదయాత్ర సందర్భంగా జగన్ గతంలో హామీ ఇచ్చి నేడు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మాకు ఎకరాకు రూ.30లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మా భూములు నేడు 22ఏ పరిధిలో ఉండడంతో మేం భూములు తాకట్టు పెట్టుకోవడం, అమ్మే పరిస్థితి లేకుండాపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మా భూములు మాకు అక్కరకు రాలేని దుస్థితి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కొత్తప్రాజెక్టులు ఎలా కడతారు? జగన్మోసపురెడ్డి మాయమాటలు నమ్మి అన్నివర్గాల ప్రజలు మోసపోయారు. టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294కోట్లు ఖర్చుచేస్తే, వైసి వచ్చాక నాలుగోవంతు ఖర్చుచేయలేదు. జగన్ దివాలాకోరు పాలనలో మెయింటెనెన్స్ లేక అన్నమయ్య ప్రాజెక్టు, పులిచింతల, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అధికారంలోకి వచ్చాక భూనిర్వాసితులకు పరిహారం అందజేసి, చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తాం.

నారా లోకేష్ ను కలిసిన లింగపాలెం గ్రామస్తులు

చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో 30వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చింతలపూడి ఎత్తిపోతల పూర్తయితే మా పొలాలు సస్యశ్యామలమవుతాయి. ఎత్తిపోతల భూ నిర్వాసితులకు నేటికీ డబ్బులు అందలేదు. గ్రామంలో రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ పథకాలను పునరుద్ధరించాలి. రైతులకు గతంలో అందించిన సబ్సిడీ పథకాలు పునరుద్ధరించాలి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

 రైతులకు అవరసరమైన ఏ సాగునీటి పథకమూ వైసీపీ పాలనలో పూర్తికాలేదు. రాష్ట్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచి నాశనం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తాం. చింతలపూడి ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందజేస్తాం. గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తిచేస్తాం. TDP పాలనలో రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలను పునరుద్ధరిస్తాం. అన్నదాత పథకం కింద రైతులకు ఏటా రూ.20వేల సాయం అందిస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన చింతలపూడి రైతులు

చింతలపూడి ఫైర్ ఆఫీస్ సెంటర్ లో రైతులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పామాయిల్ ధర టన్నుకు రూ.10వేలు పైబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. గతంలో పామాయిల్ మొక్కలు, ఎరువులకు సబ్సిడీలు వచ్చేవి, నేడు రద్దు చేశారు. గత పాలనలో రైతులకు సబ్సిడీ మీద పనిముట్లు, డ్రిప్, మోటార్లు ఇచ్చేవారు, నేడు రద్దు చేశారు. ధాన్యాన్ని సకాలంలో కొనడం లేదు, కొన్న వాటికి సకాలంలో డబ్బులు ఇవ్వడం లేదు. చింతలపూడి మెట్టప్రాంతం కావడంతో పూర్తిగా మోటార్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం. మోటార్లకు మీటర్లు పెడితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మీరు అధికారంలోకి వచ్చాక సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, చెల్లింపులకు చర్యలు తీసుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ చేతగాని  పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుల్లో కూరుకుపోయి ఆత్మాభిమానం చంపుకుని బ్రతకలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానం, కౌలురైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిపాడు. ధాన్యానికి నెలలు గడిచినా చెల్లింపులు చేసే పరిస్థితులు లేవు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏటా 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్ మాట తప్పాడు. మేం అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. గతంలో ఇచ్చిన సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. రైతు కళ్లల్లో ఆనందం చూడడమే టీడీపీ లక్ష్యం.

లోకేష్ ను కలిసిన చింతలపూడి నగర పంచాయతీ ప్రజలు

చింతలపూడి నగర పంచాయితీ ప్రజలు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా ప్రాంతంలో యువత చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు, పరిశ్రమలు పెట్టి ఉద్యోగం, ఉపాధి కల్పించాలి. మా ప్రాంతంలో పేదవారికి నివాస స్థలాలు, ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వరి, మామిడి, పామాయిల్ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. చింతలపూడికి వచ్చే మంచినీటి పైపులైనులో నీరు కలుషితమవుతోంది, కొత్త లైన్ నిర్మించాలి. చింతలపూడి నగర పంచాయతీలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్తవి నిర్మించాలి. టీడీపీ పాలనలో ప్రారంభించిన అనేక సీసీ రోడ్లను వైసీపీ ప్రభుత్వంలో నిలిపేశారు. గణేష్ కాలనీ, దేవుడుమాన్యం కాలనీ, బీసీ కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వెలంపేట కాలనీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులు సైతం అధ్వానంగా తయారయ్యి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాం. నగరంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు..అవి సరిగా వెలగడం లేదు. హిందూ శ్మశానవాటిక, పాత చింతలపూడి ఎస్సీ శ్మశానవాటికకు రక్షణ గోడ నిర్మించాలి. ఆక్రమణలను తొలగించాలి. చింతలపూడి పట్టణంలో బస్సు డిపో ఏర్పాటు చేసి రవాణా సదుపాయం కల్పించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి.

నారా లోకేష్ స్పందిస్తూ

వైసీపీ పాలన రాష్ట్రప్రజలకు శాపంగా పరిణమించింది. పాదయాత్ర సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వైసీపీ.. మాటతప్పి మడమతిప్పాడు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదలచేశాడు. ఉద్యోగాలు కోసం నిలదీస్తున్న యువతను జైళ్లలో పెట్టి వేధిస్తున్నాడు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కనుమరుగైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి, వాడలు మురికి వాడలుగా మారాయి, ప్రధాన రహదారులు మృత్యు కూపాలయ్యాయి. కాంట్రాక్టర్లకు 1.30లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడంతో వైసీపీ ముఖం చూసి పనులుచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక చింతలపూడి నగర పంచాయతీని అభివృద్ధి చేస్తాం. నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరిస్తాం. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదలచేసి, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి మెట్టప్రాంత రైతుల కష్టాలు తొలగిస్తాం.

Also Read This Blog :Empowering Trails: Yuvagalam’s Quest for a Stronger Society

Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *